సీఎం జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీయేలో వైసీపీ చేరుతుందా ?
CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ..ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరాలంటూ జగన్ను కేంద్రం కోరుతోంది. వైసీపీ వర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. జగన్ ఢిల్లీ టూర్పై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్లమెంట్ లో వైసీపీ సంఖ్యాపరంగా బలంగా ఉంది.
వైసీపీ ఎన్డీయేలో చేరితే..మరింత బలం వస్తుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఎన్డీయేలో చేరిక విషయాన్ని వైసీపీ సున్నితంగా తిరస్కరిస్తూ..వస్తోంది. మోడీతో జరిగే చర్చలో ఈ అంశం చర్చకు వస్తుందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు.
భారత ప్రధాన మంత్రి మోడీతో జరిగే చర్చ కీలకంగా మారనుంది. అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్రానికి సంబంధించి నిధులు, రాజకీయ వర్గాలపై జగన్ చర్చించనున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ సాయంత్రం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటి కానున్నారు.
ప్రధాని భేటిలో రాష్ట్రాభివృద్ధి సహా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, మూడు రాజధానులు, మండలి రద్దు,.. కోవిడ్ కట్టడి చర్యలు సహా రాష్ట్ర అభివృద్ధి పనులను మోదీకి వివరించనున్నారు జగన్. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీకి జగన్ వినతి పత్రం ఇవ్వనున్నారు.
గత ప్రభుత్వ కుంభకోణాలనూ మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం నాడు జరిగే అపెక్స్ (Apex Council) కౌన్సిల్ సమావేశానికి జగన్ హాజరుకానున్నారు.