కరోనా అన్నది..ఎవరికైనా వస్తుంది..పోతుంది : సీఎం జగన్
సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్కు, కోవిడ్ ఆపరేషన్స్లో ఉండే డాక్టర్ చంద్రశేఖర్కు కోవిడ్ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్ అన్నది.. ఎవరికైనా వస్తుంది..పోతుంది..కాకపోతే.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలను తగ్గించాల్సి ఉందన్నారు సీఎం జగన్.
2020, జులై 28వ తేదీ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…సీఎం జగన్ మాట్లాడుతూ…
‘కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్ వస్తుంది..పోతుంది కూడా..వ్యాక్సిన్ వచ్చేంతవరకూ వేచి చూడాలి. మన దగ్గర లక్షకుపైగా కేసులు నమోదైతే.. అందులో సగం మందికి నయం అయ్యింది. వారు ఇళ్లకు తిరిగి వెళ్లారు కూడా. 85శాతం మందికి ఇళ్లల్లోనే నయం అవుతున్న పరిస్థితులు ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించండి.
కోవిడ్ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి ? ఎక్కడకు పరీక్షలు చేయించుకోవాలి ? ఎవరికి కాల్ చేయాలన్నదానిపై వివరాలు అందరికీ తెలియజేయాలి. ఈ వివరాలు తెలియని మనిషి రాష్ట్రంలో ఉండకూడదు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ఉంచాలి. పోస్టర్లలో నంబర్లు ఇచ్చాం. 104, 14410 కాల్ సెంటర్ నంబర్లు ఉన్నాయి.
అంతేగాక జిల్లాలో కోవిడ్ కంట్రోల్ రూం కాల్ సెంటర్ నంబర్ కూడా ఈ అడ్వరై్టజ్మెంట్లో పెట్టామన్నారు. ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్ చేసినప్పుడు, సమర్థవంతంగా పనిచేసేలా చేయాలి. క్రమం తప్పకుండా అధికారులు.. కాల్ చేసి కాల్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలి. సంబంధిత వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తనిఖీ చేయాలి. కాల్చేయగానే స్పందించే తీరును కచ్చితంగా పర్యవేక్షించాలి. ఆ నంబర్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? చెక్ చేయాలి’ అని సీఎం జగన్ సూచించారు.
కోవిడ్ పాజిటివ్ కేసును గుర్తించిన తర్వాత 1. హోం క్వారంటైన్, 2. కోవిడ్ కేర్ సెంటర్ 3. జిల్లా కోవిడ్ ఆస్పత్రి 4. రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులకు వీరిని వారి ఆరోగ్య పరిస్థితులు ఆధారంగా పంపిస్తామన్నారు. హోంక్వారంటైన్ కోసం ఇంట్లో వసతులు ఉంటే… రిఫర్ చేస్తామని, ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని… కోవిడ్ కేర్ సెంటర్కు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు.
హోంక్వారంటైన్లో ఉన్న ఆవ్యక్తిని పూర్తిగా పర్యవేక్షించాలి, డాక్టరు తప్పనిసరిగా విజిట్ చేయాలి, వారికి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలన్నారు. క్రమం తప్పకుండా.. వారి ఆరోగ్య వివరాలను కాల్ చేసి కనుక్కోవాలి, ఇవన్నీ తప్పకుండా జరగాలన్నారు సీఎం జగన్.
ఇక కోవిడ్ కేర్ సెంటర్లో డాక్టర్లను అందుబాటులో ఉంచాలి.
పారిశుద్ధ్యం, ఆహారంపై తప్పకుండా ధ్యాసపెట్టండి.
నాణ్యమైన మందులు ఇస్తున్నారా? లేదా? చూడండి.
క్రమం తప్పకుండా డాక్టర్లు వెళ్తున్నారా? లేదా? చూడండి.
- 128 డిస్ట్రిక్ ఆస్పత్రులను మనం గుర్తించాం.
- 32వేల బెడ్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
- ఇక్కడ ఫెసిలిటీస్ను తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
- 30 నిమిషాల్లో పేషెంట్ అడ్మిషన్ జరగాలి.