అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి కరోనా పరీక్షలు. 28వేల పోస్టుల భర్తీకి సీఎం జగన్ అనుమతి

  • Published By: naveen ,Published On : September 8, 2020 / 04:00 PM IST
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి కరోనా పరీక్షలు. 28వేల పోస్టుల భర్తీకి సీఎం జగన్ అనుమతి

స్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న సీఎం జగన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు జరగాలన్నారు. ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. పిహెచ్‌సిలు, యుహెచ్‌పిలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రలు, జిజిహెచ్‌లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోవిడ్‌ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ రాకూడదన్నారు.

104 నెంబర్ ను బాగా ప్రచారం చేయాలి:
కోవిడ్‌ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కాల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలన్నారు. ఆ ఫోన్‌ కాల్స్‌పై ఎలా రెస్పాండ్‌ అవుతున్నామనేదే మన పనితీరుకు అద్దం పడుతుందన్నారు.

అరగంటలో ఫలితం రావాలి:
కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్‌ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జెసిలు ప్రతిరోజూ 104 కాల్‌ సెంటర్లకు, జిల్లా కోవిడ్‌ సెంటర్‌లకు మాక్‌ కాల్స్‌ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందో లేదో పరీక్షించాలన్నారు. ఆర్‌టి పిసిఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24గంటలు, ర్యాపిడ్‌ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు.
https://10tv.in/ap-government-bans-rummy-cabinet-key-decisions/
17వేల నియామకాలకు అనుమతి:
జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలను అందించడం జరిగిందన్న సీఎం, ఎక్కడా కిట్లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదన్నారు. పాజిటీవ్‌ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు వున్న వారిని కచ్చితంగా హోం క్వారంటైన్‌లో వుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో అదనంగా 17వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరునెలల కాలానికి కాంట్రాక్ట్‌ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చామన్నారు.

11వేల ట్రైనీ నర్సుల నియామకం:
మరో 11 వేల మంది ట్రైనీ నర్సులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదని, వాటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మరో వారం రోజుల్లో రెగ్యులర్‌ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్‌ విధుల్లో చేరాలన్నారు. దానిని కూడా కలెక్టర్లు, జెసిలు పర్యవేక్షించాలన్నారు.

హోం ఐసోలేషన్‌లో వున్న వారికి అవసరమైన మందులతో కూడిన మెడికల్‌ కిట్‌లను పంపిణీ చేశామన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ ఫోన్‌లో 14 రోజుల పాటు పేషంట్‌కు అందుబాటులో వుండాలన్నారు. జాయింట్‌ కలెక్టర్లు ఈ హోం కిట్‌లలో అన్ని మందులు వున్నాయో లేదో పర్యవేక్షించాలని జగన్ చెప్పారు.