AP Cabinet Meeting: ఏపీలో మంత్రుల రాజీనామా కోరనున్న సీఎం జగన్: నేడు చివరి కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది. ఈమేరకు గురువారం మధ్యాహ్నం నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్ మంత్రుల నుంచి రాజీనామా కోరనున్నట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో గురువారం ఏపీ రాష్ట్ర కేబినెట్ చివరి సమావేశం నిర్వహించనుంది. ఈసందర్భంగా మొత్తం 25 మంది మంత్రుల రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. మంత్రుల రాజీనామా, కొత్త మంత్రివర్గ విస్తరణ సహా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారమే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి చర్చించారు. సామాజిక వర్గాల వారీగా మంత్రిమండలిలో ప్రాధాన్యం కల్పిస్తామని రెండున్నరేళ్ల క్రితమే సీఎం జగన్ ప్రకటించారు.
ఇదిలాఉంటే మంత్రుల రాజీనామా పై ఆయాశాఖల మంత్రులు ఇప్పటికే సమాచారం అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి మాత్రమే కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనుంది. కొత్తగా మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే విషయం అటు అధికార పార్టీ నేతలతో పాటు ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల నుంచి గురువారం రాజీనామాలు కోరినా కొత్త మంత్రుల వివరాలను ఏప్రిల్ 10 వరకు గోప్యంగానే ఉంచనున్నారు. మంత్రిమండలి చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈక్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..అటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు, ఇటు గుంటూరు నుంచి వాహనాలపైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Also Read:AP Cabinet Meeting : రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం