ఏపీలో మహిళల భద్రత కోసం.. అభయం యాప్‌ని ప్రారంభించిన సీఎం జగన్

  • Published By: naveen ,Published On : November 23, 2020 / 12:23 PM IST
ఏపీలో మహిళల భద్రత కోసం.. అభయం యాప్‌ని ప్రారంభించిన సీఎం జగన్

cm jagan abhayam: ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొచ్చాయి. అదే అభయం. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాయి. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే… వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు అభయం అనే ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. సోమవారం(నవంబర్ 23,2020) సీఎం జగన్‌ ఈ ప్రాజెక్ట్ ని లాంఛనంగా ప్రారంభించారు. క్యాంప్‌ ఆఫీస్‌లో వర్చువల్‌ పద్ధతిలో అభయం యాప్ ని లాంచ్ చేశారు.

abhayam project


https://10tv.in/cm-ys-jagan-to-launch-abhayam-project/
* మహిళల భద్రత కోసం అభయం పేరుతో సరికొత్త ప్రాజెక్ట్
* అభయం యాప్ ని ప్రారంభించిన సీఎం జగన్
* 138.48 కోట్ల రూపాయలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ఆధారిత ప్రాజెక్ట్
* అభయం స్కీమ్ కిందకు లక్ష ఆటోలు తీసుకురావడమే లక్ష్యం
* దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పించాం
* పైలట్ ప్రాజెక్టుగా విశాఖ ఎంపిక
* వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు
* వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు

abhayam

సీఎం జగన్ కామెంట్స్:
* మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు
* ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు కనిపిస్తున్నాయి
* దిశ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం
* ప్రతి గ్రామంలో మహిళా పోలీసు మిత్రలను తయారు చేస్తున్నాం
* అభయం యాప్ రవాణశాఖ నిర్వహణలోకి తీసుకొస్తున్నాం
* ట్యాక్సీలు, ఆటోల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు అభయం యాప్
* మహిళల భద్రతే లక్ష్యంగా అభయ యాప్
* ప్రతీ ట్యాక్సీ, ఆటోలో అభయం యాప్
* ఆటోలు, ట్యాక్సీలు ఎక్కేందుకు భయపడాల్సిన అవసరం లేదు

2015లో 80.09 కోట్లు కేటాయింపు :
అభయం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి 80.09 కోట్లు కేటాయించింది. దీంట్లో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి టెండర్లను పరిశీలించింది. గతేడాది(2019) యష్‌ టెక్నాలజీస్‌ ఈ టెండర్ ను దక్కించుకుంది.

పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ:
దశలవారీగా రాష్ట్రంలో లక్ష రవాణా వాహనాలకు ట్రాకింగ్‌ డివైజ్ లు బిగించి వచ్చే ఏడాది(2021) నవంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. రవాణా వాహనాల్లో ట్రాకింగ్‌ డివైజ్ లు ఏర్పాటు చేస్తారు. రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చుతారు. తొలుత వెయ్యి ఆటోల్లో ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే(2021) ఫిబ్రవరి 1 నాటికి 5 వేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది(2021) నవంబర్ నాటికి రాష్ట్రంలోని లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు కొనసాగుతుంది.

యాప్ ఇలా పని చేస్తుంది:
ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో అభయం మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనం ఎక్కే ముందు వాహనానికి అతికించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో డ్రైవర్ ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పోలీసులకు పంపితే.. ఆ వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ కు చేరుతుంది. దీంతో క్యాబ్‌ లేదా ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ తర్వాత సమీపంలోని పోలీస్‌ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు.