CM YS Jagan Kuppam Tour: 23న చంద్రబాబు నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన.. ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే ..
ఈనెల 23న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను విడుదల చేస్తారు. సీఎం జగన్కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
CM YS Jagan Kuppam Tour: ఏపీ రాజకీయాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం వేదికగా రాజకీయం రంజుగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో పాగావేసేందుకు అధికార వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొన్నిదఫాలుగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ సారి చంద్రబాబు కుప్పం నుంచి బరిలోకి దిగితే బాబు విజయాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా వైసీపీ అగ్రనాయకత్వంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిసైతం కుప్పం నియోజకవర్గంపై దృష్టిసారించినట్లు కనిపిస్తుంది.
ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలోని గోడలపై 175కు 175 సీట్లు.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ రాస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికితోడు సీఎం జగన్ స్వయంగా కుప్పం నియోజకవర్గంపై సమీక్ష చేయడంతో పాటు వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరతే పోటీ చేస్తారని ప్రకటించారు. దీనికితోడు కుప్పం నియోజకవర్గంలో రూ. 66 కోట్ల విలువైన అభివృద్ధి పనుల మంజూరు చేశారు. తాజాగా ఈనెల 23న కుప్పంలో జగన్ పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేస్తారు. అయితే 22నే జగన్ పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల 23కు వాయిదా పడింది.
Ant Population On Earth: భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో తెలుసా..? పరిశోధకులు ఎలా లెక్కించారంటే..
కుప్పం పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23న ఉదయం 9.15గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరుతారు. ఉదయం 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 నుంచి 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జగన్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.