ఏపీలో సమగ్ర భూముల సర్వే
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన విధంగానే..ఏపీ రాష్ట్రంలో భూ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
భూముల రీ సర్వే ప్రాజెక్టుపై రెవెన్యూ అధికారులతో 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 2021, జనవరి 01 నుంచి భూముల రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2023, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అర్బన్ ప్రాంతాల్లోనూ సమగ్ర భూ సర్వే చేయాలని సూచించారు. భూ సర్వే..వివాదాల పరష్కారానికై మొబైల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. భూములను సర్వే చేసే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.