ఏపీలో ఎవరికెన్ని సీట్లు : రిపబ్లిక్ టీవీ సర్వే

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:50 AM IST
ఏపీలో ఎవరికెన్ని సీట్లు : రిపబ్లిక్ టీవీ సర్వే

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై సర్వేలు షురూ అయిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ సమయం కూడా ఇంకా రానేలేదు. అప్పుడే సర్వేలు వారి విశ్లేషణలను వెల్లడించేస్తున్నాయి. ఏపీ పార్టీలలో  ఎన్నికల వేడి తెలంగాణ ఎన్నికల నుండి మరింతగా వేడెక్కింది. ఎవరికి వారు తమ క్యాడర్ ను సిద్ధపరుస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై సర్వేల హడావిడి ప్రారంభం అయింది.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఆరంభమైంది. వివిధ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ వ్యూహాలకు పదునుపెట్లి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మీడియా సంస్థలు ప్రీ-పోల్ సర్వేలను నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుందో రిపబ్లిక్ టీవీ తాజా సర్వే ఫలితాలు..
ఈ నేపథ్యంలో సీ ఓటర్‌తో కలిసి రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే నిర్వహించి సర్వే ఫలితాలను వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలు వెలువరించింది. బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఏకం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
ఏపీలో మొత్తం 24 పార్లమెంటు స్థానాలకు గానూ వైసీపీ 14 సీట్లను గెలుపొందుతుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. మిగతా 11 సీట్లను టీడీపీ- కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పింది. వీటిలో 8 టీడీపీ, 3 కాంగ్రెస్ దక్కించుకుంటాయని రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది. 

రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే అంచనాలు..
గత కొంతకాలం వరకు వైఎస్ జగన్‌కి అనుకూలంగా ఉందని, తీర్పు ఏకపక్షమేనని అంచనా వేసినా కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిన తర్వాత చంద్రబాబు మళ్లీ లైన్‌లోకి వచ్చారని తెలిపింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి ప్రభావం ఏపీలో ఉండబోదని స్పష్టం చేసింది. వైసీపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీ- కాంగ్రెస్ కూటమికి 38.2 శాతం ఓట్లు దక్కించుకుంటుందని, బీజేపీకి 11 శాతం, ఇతరులు 9.3 శాతం ఓట్లు దక్కించుకుంటారని సర్వే ఫలితాలలో  పేర్కొంది. అయితే, అక్టోబరులో రిపబ్లిక్ టీవీ సర్వేలో వైసీపీ 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది. 

పెరిగిన టీడీపీ స్థాయి..తగ్గిన ప్రతిపక్షాలు
కానీ రెండు నెలలు తిరక్కముందే పరిస్థితి అనూహ్యంగా మారిపోయిందని, టీడీపీ తన స్థానాలకు 8కి పెంచుకోవడమే కాదు, మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిసి మొత్తం 11 సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేసిన బీజేపీ ఏపీలో 2 పార్లమెంటు స్థానాలను చేజిక్కించుకుంది. కానీ, ప్రస్తుతం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేయడంతో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదు కదా డిపాజిట్లు కూడా దక్కవని రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే తెలియజేసింది.