మద్యాన్ని కంట్రోల్ చేస్తే టూరిజం దెబ్బతింటుంది – అవంతి
దశల వారీగా మద్య నిషేధంపై ఏపీ మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. మద్య నిషేధానికి మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం నాడు ఈ సమావేశం జరిగింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు వస్తాయని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. మద్యాన్ని కంట్రోల్ చేస్తే..టూరిజం దెబ్బతింటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
టూరిజం కాదు..సమాజం కోసం ఆలోచించాలని సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. మందు తాగే వారికి రిటైల్ షాపుల ద్వారా అందించే మద్యం బాటిళ్ల సంఖ్యను తగ్గించాలని సూచించారు. వినియోగదారులకు ఒక్క బాటిల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు సవరించాలని సూచించారు. మద్యపానాన్ని కంట్రోల్ చేయాల్సిందేనంటూ మహిళా మంత్రులు ముక్తకంఠంతో కోరారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఇప్పటికే పలు హామీలు అమల్లోకి తెచ్చిన ఈయన..దశల వారీగా మద్య నిషేధంపై చర్యలు తీసుకుంటున్నారు.
> 2020 జనవరి నుంచి కొత్త బార్ల విధానం అమల్లోకి తేనున్నారు.
> రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
> స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం 798 బార్లు ఉన్నాయి. వాటిని 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
> బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను విధిస్తూ ఉత్తర్వులు.
> కొత్త విధానం ప్రకారం రెండేళ్లకు లైసెన్సు ఇవ్వనుంది.
> రెండేళ్లకు లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ధారించారు.
> ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేలా అనుమతి.
> ఏపీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులు.
> రాష్ట్రంలో 3వేల 500 మద్యం దుకాణాలు.