Corona In AP : ఆ రెండు జిల్లాలో వైరస్ ఉగ్రరూపం
ఏపీలోని కృష్ణా, కర్నూలు జిల్లాల్లో కరోనా విజృంభించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజుకు 50పైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 1 తర్వాత జిల్లాలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయడంతో రోజురోజుకీ కేసులు క్రమంగా పెరిగాయి. 10 రోజులకు పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపించింది.
ఇంతలోనే పదో తారీకు నుంచి రోజు 50 కేసులకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020, జూన్ 21వ తేదీ ఆదివారం 66 కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లా వెయ్యి కేసుల మార్క్ను దాటగా… యాక్టివ్ కేసుల్లో రాష్ట్రంలోనే టాప్కు చేరింది.
మొన్నటి వరకు కరోనా విషయంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు కృష్ణా ఆ జిల్లాను దాటేసింది. ప్రస్తుతం కర్నూలులో 1,294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 1,048 మంది కరోనా బారిన పడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… యాక్టివ్ కేసుల్లో కర్నూలును కృష్ణా జిల్లా దాటేసింది.
కర్నూలులో 528 యాక్టివ్ కేసులుండగా, కృష్ణాలో 559 యాక్టివ్ కేసులున్నాయి. మరణాలలో కూడా కృష్ణా జిల్లానే మొదటి స్థానంలో ఉంది. వారం రోజుల క్రితం వరకు కర్నూలు జిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యేవి. శనివారం రెండు జిల్లాల్లో 33 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం కృష్ణాలో ముగ్గురు మృతి చెందడంతో జిల్లాలో మరణాల సంఖ్య 36కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక మరణాలు కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయి.
విజయవాడ నగరంలో పరిస్థితి చేయిదాటిపోయింది. జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో 80శాతం విజయవాడలోనే ఉన్నాయి. దీంతో అధికారులు నగరంలో 80 ప్రాంతాన్ని రెడ్జోన్లగా ప్రకటించారు. నగరంతో పాటు చుట్టు పక్కల పంచాయతీలను కూడా ఈ పరిధిలో చేర్చారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. పైగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
Read: నాకు ప్రాణహాని ఉంది.. లోక్సభ స్పీకర్కు వైసీపీ ఎంపీ లేఖ