అనంతపురం జిల్లాలో కరోనా కలకలం.. ఒకే గ్రామంలో 10 మందికి పాజిటివ్

అనంతపురం జిల్లాలో కరోనా కలకలం.. ఒకే గ్రామంలో 10 మందికి పాజిటివ్

Corona Positive for 10 people : అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో 10 కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తలుపుల మండలం ఎర్రసానిపల్లిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్వరంతో కదిరి ఆసుపత్రిలో చేరారు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేశారు.

అక్కడ చికిత్స పొందిన తర్వాత గత నెల 28న అతను మృతి చెందారు. అతనితో కాంటాక్ట్‌లో ఉన్న 15 మందికి కరోనా టెస్టులు చేయగా 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వీళ్లందరినీ హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎర్రసానిపల్లి గ్రామంలో శానిటేషన్ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్యులు సూచించారు.

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది.

మూడోరోజు కూడా మరణాల సంఖ్య 100కు దిగువనే నమోదు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. కొత్తగా 89 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు లక్ష 57వేల 435 మంది ఈ మహ్మమారి కారణంగా మరణించారు.