ఏపీలో కరోనా టెస్టులు, ట్రేసింగ్ భేష్ : బ్రిటిష్ హైకమిషనర్
కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్ దౌత్యాధికారులతో శుక్రవారం (ఆగస్టు 7,2020) ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్లు పాల్గొన్నారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాన్ థాంప్సన్ ప్రశంసించారు.
కరోనా లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ – యూకేలు రెండూ కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. పరిశోధనలు, వ్యాక్సిన్ తయారీ, ఔషధాల తయారీలో పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ యూకేలో తయారవుతోందని.. భారత్లో ఈ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.
భారీగా కరోనా టెస్టులు చేయడంలో, పాజిటివ్ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్ విశేషంగా పనిచేస్తోందని మెచ్చుకున్నారు. అలాగే కరోనా మరణాల రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయమన్నారు. టెలీ మెడిసిన్ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోందన్నారు. ఏపీ మెడ్ టెక్జోన్తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కరోనా నివారణ కోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు.
ఈ విషయంలో స్టార్టప్ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుందని చెప్పారు. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంగ్లండ్కు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ భాగస్వామంతో 108, 104 లాంటి అంబులెన్స్ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలను ఉపయోగించే అవకాశం ఉంటుందని జాన్ థాంప్సన్ వెల్లడించారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్ రావాల్సిందిగా జగన్ను బ్రిటిష్ హైకమిషనర్ ఆహ్వానించారు.
రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నామని తెలిపారు. సగటున రోజుకు 62 వేల వరకూ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. 90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల కేసులు బాగా నమోదవుతున్నాయని వెల్లడించారు. కరోనా సోకిన వారిని వేగంగా గుర్తించి, వారిని ఐసోలేట్ చేయడానికి, వైద్యం అదించండానికి తద్వారా మరణాల రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏపీలో కరోనా మరణాల రేటు దేశం సగటుతో పోలిస్తే చాలా తక్కువన్నారు. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతంగా ఉంది. నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అన్ని రకాల పెద్ద ఆస్పత్రులు, వైద్య సేవలు అక్కడే అభివృద్ది చెందాయని పేర్కొన్నారు. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేవన్నారు. తాము అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఆరోగ్యరంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే అన్నారు. ప్రస్తుతం ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టి పెట్టామని తెలిపారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 16 కొత్త మెడికల్ కాలేజీలను, ఆస్పత్రులను తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతి పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధన ఆస్పత్రులను బాగా అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిచేస్తున్నామని పేర్కొన్నారు.
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం దాంతో కలిసి బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈలోగా మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్స్ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ను డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్ సహకారం ఏపీ రాష్ట్రానికి చాలా అవసరం ఉందన్నారు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని చెప్పారు.
ఆస్పత్రులకు ఆలస్యంగా పోవడం వల్లే కరోనా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఎంత త్వరగా వెళ్తే, అంతగా మరణాలు తగ్గించవచ్చన్నారు. 10 వేలకు పైగా రెమిడెసివర్ ఇంజక్షన్లు వాడి చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించామని తెలిపారు. త్వరగా ఆస్పత్రికి వెళ్లడం చాలా ముఖ్యమని జగన్ అన్నారు.