నంద్యాల అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులకు బెయిల్ మంజూరు

  • Published By: bheemraj ,Published On : November 9, 2020 / 04:46 PM IST
నంద్యాల అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులకు బెయిల్ మంజూరు

Abdul Salam family suicide case : కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులకు బెయిల్ మంజూరైంది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కు నంద్యాల కోర్టు సోమవారం (నవంబర్ 9, 2020) బెయిల్ మంజూరు చేసింది.



ఫ్యామిలీ సూసైడ్ కు కారణమయ్యారంటూ సీఐ, హెడ్ కానిస్టేబుల్ పైన 323, 506, 509, 306 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమ క్లయింట్లకు సెక్షన్ 306 వర్తించదని సీఐ, కానిస్టేబుల్ తరపు లాయర్లు వాదించగా ఏకీభవించిన కోర్టు వారిపై ఆ సెక్షన్ ను తొలగించింది. మిగిలిన సెక్షన్లు బెయిలబుల్ కావడంతో వారికి రూ.10 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.



https://10tv.in/new-twist-sheikh-abdul-salam-family-suicide-case-at-nandyal/
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం ఆటో డ్రైవర్. అతడి కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. షేక్ అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహన్ (38)తో పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు రైల్వే స్టేషన్‌ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.



ఆర్థిక సమస్యలతో వారు ఆత్మహత్య చేసుకున్నారని తొలుత అంతా భావించారు. అయితే పోలీసుల వేధింపులే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అబ్దుల్ సలాం తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సలాం అందులో తెలిపాడు.



‘ఆటోలో జరిగిన రూ. 70వేల దొంగతనం, బంగారం షాపులో జరిగిన దొంగతనంలో నాకు సంబంధం లేదు. అయినా నేను చేయని దొంగతనంలో నన్ను వేధిస్తున్నారు. నాపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు చావు తప్ప మరో దారి లేదు’ అంటూ సెల్ఫీ వీడియోలో ఇద్దరు బిడ్డలు, భార్యతో కలిసి కన్నీరుమున్నీరవుతూ అబ్దుల్ సలాం చెప్పాడు.



అబ్దుల్ సలాం గతంలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. ఓ బంగారం దుకాణంలో కూడా పని చేశాడు. దొంగతనం ఆరోపణలతో ఉద్యోగం పోయింది. జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఆటో అద్దెకు తీసుకుని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే ఆటోలో తన రూ.70వేలు పోయాయంటూ ఓ ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతడిని వేధింపులకు గురి చేసినట్టు అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.



అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను సీఎం జగన్‌ తీవ్రంగా పరిగణించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే వేగంగా స్పందించిన సీఎం జగన్.. బాధ్యుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లతో మాట్లాడిన సీఎం, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లు, బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ను నియమించారు.