ఏపీలో 5858కి చేరిన కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా కరోనా కేసుల సంఖ్య 5858కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 222 మందికి కరోనా సోకిందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది.
వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 33 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికీ కొవిడ్ పాజిటివ్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,477 నమూనాలను పరీక్షించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో.. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 82కి చేరినట్లు పేర్కొన్నారు.
ఇక రోనా టెస్టులపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రైవేటు ల్యాబ్స్లోనూ కరోనా టెస్టులు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ పరీక్షలు చేయవచ్చంటూ.. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్ఏబీఎల్), భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్(ఐసిఏంఆర్) నుంచి ప్రైవేటు ల్యాబ్స్ ఆమోదం పొంది ఉండాలి. ప్రైవేటు ల్యాబ్స్లో పరీక్షలు చేయించుకునే వారి నుంచి రూ.2900 చార్జ్ వసూలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.