Covid Double Mutant: తెలుగు రాష్ట్రాల్లో ఉందంతా డబుల్ మ్యూటెంటే..
తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని చెబుతున్నారు సీసీఎంబీ సైంటిస్టులు...
Covid Double Mutant: తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని చెబుతున్నారు సీసీఎంబీ సైంటిస్టులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొవిడ్ రెండో ఉద్ధృతి మార్చి నెల మధ్యలో మొదలైంది. దాదాపు నెలన్నరకుపైగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గుర్తించారు.
కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి.1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందని తెలిసింది. ఇతర రాష్ట్రాల డేటాతో పోల్చి చూడగా మహారాష్ట్రలో రెండో ఉధృతి అన్ని రాష్ట్రాల కంటే ముందు ఫిబ్రవరిలో మొదలైంది. అప్పటివరకు అక్కడ వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం కనుమరుగై డబుల్ మ్యుటెంట్ విస్తరించింది.
అలా అక్కడ అనూహ్యంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చి ప్రారంభం వరకు ఎన్440కే రకం వ్యాప్తిలో ఉండేది. ఆ స్థానంలో నెలన్నర రోజుల్లోనే డబుల్ మ్యూటెంట్ కేసుల పెరుగుదలకు కారణమైంది. ఈ రెండింటిని విశ్లేషించిన సైంటిస్టులు కేసుల పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్ కారణమైందని కన్ఫర్మేషన్కు వచ్చారు.
తెలంగాణలో ఇండియన్ వేరియంట్గా చెబుతున్న బి.1.617 మార్చి, ఏప్రిల్లో బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ మొదట్లో మూడో వంతు కేసుల్లో ఎన్440కే రకం వైరస్ బయటపడగా.. అది 20 శాతం లోపే ఉందని.. అక్కడ డబుల్ మ్యూటెంట్ వ్యాపిస్తోందని చెబుతున్నారు. కర్ణాటక, కేరళలో ఎన్440కే రకం వైరస్ దాదాపు కనుమరుగయ్యే దశలో ఉందని అంటున్నారు.
గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డాటా పొందుపరచిన గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో బి.1.617, బి.1.1.7, బి1 వ్యాప్తి పెరుగుతోందని సీసీఎంబీ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.