Covishield Vaccine : ఏపీకి చేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు
రాష్ట్రంలో కొవిడ్ టీకా కొరత నెలకొన్న వేళ మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
Covishield Vaccine : రాష్ట్రంలో కొవిడ్ టీకా కొరత నెలకొన్న వేళ మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు టీకాలను అధికారులు తరలించనున్నారు. టీకా కొరత దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో 45ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు.
వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు:
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించగా.. 21వేల 954 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. మరో 72 మంది చనిపోయారు. ప్రస్తుతం 13వేల 353 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,28,186 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,70,60,446 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
గత 24 గంటల్లో కొవిడ్తో విశాఖలో అత్యధికంగా 11మంది చనిపోగా, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, అనంతపురం 8, ప్రకాశం 6, చిత్తూరు 5, గుంటూరు 5, కృష్ణా 4, కర్నూలు 4, శ్రీకాకుళం, 4, నెల్లూరు 2 మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కి చేరింది. 24 గంటల వ్యవధిలో 10,141 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 10,37,411 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 3,531 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో అత్యల్పంగా 548మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్ బారినపడ్డారు.