ఏపీ కి నివర్ తుపాను ముప్పు

  • Published By: murthy ,Published On : November 24, 2020 / 08:30 AM IST
ఏపీ కి నివర్  తుపాను ముప్పు

Cyclone Nivar to hit south Andhra pradesh coast wednesday : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి 450 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది దిశ మార్చుకుని వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయానికే తుఫానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

నివర్ తుఫాన్‌ ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం కరైకల్‌ (పుదుచ్చేరి), మహాబలిపురం(తమిళనాడు) మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.  నివర్‌ తుపాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం‌పైనా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం తీవ్ర తుపానుగా తీరం దాటాక… అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుపాను హెచ్చరికతో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.



నివర్‌ తుపాను ముప్పు తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌పైనా ఉండనున్నట్లు తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మీదుగా వెళుతుండగానే అది వాయుగుండంగా బలహీనపడే అవకాశాలున్నాయి. సోమవారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. పుదుచ్చేరిలోని కరైకల్‌, మామల్లపురం(మహాబలిపురం) మధ్య తీరం దాటేప్పుడు గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ దాకా గాలులు వీచే అవకాశముంది.
https://10tv.in/astrazeneca-covid-19-vaccine-can-be-90-effective-results-show/
చిత్తూరు జిల్లాలోకి కూడా దాదాపు ఇదే తీవ్రతతో రావొచ్చని అంటున్నారు. గురువారం వరకూ తుపాను ఇదే జిల్లా మీదుగా ఇది కొనసాగనుంది. నివర్ తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంద్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.



అత్యంత భారీవర్షాలు ఈనెల 24న తమిళనాడు, పుదుచ్చేరిలోని పుదుకొట్టాయ్‌, తంజావూరు, తిరువారూర్‌, కరైకల్‌, నాగపట్టిణం, కడలూర్‌, అరియలూర్‌, పెరబలు జిల్లాల్లో ఉంటాయని అంచనా. 25న కడలూర్‌, కల్లకుర్చి, పుదుచ్చేరి, విల్లుపురం, తిరువణ్ణమలై, చెంగల్‌పట్టు, అరియలూర్‌, పెరంబలూర్‌, కరైకల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని అంచనా వేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 25, 26వ తేదీల్లో అత్యంతభారీ వర్షాలుంటాయని వెల్లడించారు.

ఇదే తీవ్రత తెలంగాణ జిల్లాల్లో 26న ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ తీరంమీదుగా గాలుల ప్రభావం మొదలైనట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం చురుగ్గా ఉండటంతో.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారుల్ని హెచ్చరించడంతో పాటు విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నంలో మొదటి ప్రమాదహెచ్చరిక ఎగురవేసినట్లు వెల్లడించారు.



నివర్‌ తుపాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలతో రైతుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతం వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, ఉద్యాన తదితర పంటల అన్నదాతలు అల్లాడుతున్నారు.

ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఖరీఫ్‌ పంటలు 38,12,577 ఎకరాల్లో, రబీ పంటలు 9,60,747 ఎకరాల విస్తీర్ణంలో వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా పంటల నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. తీవ్ర తుపాను హెచ్చరికలతో వివిధ శాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని.. విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు.



మరోపక్క అరేబియా సముద్రంలోని ‘గతి’ తుఫాను భారత్‌వైపు కదులుతోందని, ప్రస్తుతం ఇది సొకోట్రాట(యెమన్‌)కు దక్షిణాన 210 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు చెబుతున్నారు. భారత్‌వైపు ప్రభావం చూపితే రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కోణంలో ఆందోళన చెందుతున్నారు.

ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ర్టాలకు పొంచి ఉన్న తీవ్ర తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆయన అధ్యక్షతన సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ  కమిటీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు.