తిరుమలలో వైభవంగా దీపావళి ఆస్థానం
Deepavali Asthanam performed with religious fervour in Tirumala Temple : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శనివారం నాడు టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజున శ్రీవారికి సుప్రభాతం నుంచి మొదటిగంట నివేదన వరకూ కైంకర్యాలను యథావిధిగా జరిపి అనంతరం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది.
ఆస్థానంలో భాగంగా శనివారం నాడు ఉభయదేవేరులతో మలయప్పస్వామిని సర్వభూపాల వాహనంపై ఘంటా మండపంలో వేంచేపు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదలను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు శ్రీదేవి భూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొని నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
మరోవైపు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.