Palla Srinivas : టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన నిర్మాణాలు కూల్చివేత
విశాఖలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
Palla Srinivas : విశాఖలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుంగ్లామ్ గ్రామంలో 12.5ఎకరాలు, జగ్గరాజుపేట గ్రామంలో 5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆక్రమిత భూముల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పల్లా శ్రీనివాస్ కుటుంబసభ్యులు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా నిర్మాణాలు కూల్చివేయడం దారుణం అన్నారు పల్లా శంకర్ రావు.
టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పై వైసీపీ నేతలు కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. పల్లా శ్రీనివాస్ ఒకేచోట 56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు తేలిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి విశాఖలో పల్లా కుటుంబానికి చెందిన ఆస్తులను అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసు బలగాల మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఆస్తులను కూల్చి వేస్తున్నారని గాజువాకలోని పల్లా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.