ఏలూరులో వింతవ్యాధి : AIMS రిపోర్టులో ఏముందో ? ఉత్కంఠ
ఏలూరులో వింత వ్యాధి ఎలా వచ్చింది ? ఏమి కారణం ? ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసిన ఈ వ్యాధి ఎలా వచ్చిందనే దానిపై ఓ క్లారిటీ రానుంది. కాసేపట్లో రిపోర్టు రానుంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం జగన్కు నివేదిక అందించనున్నారు ఏయిమ్స్ (AIMS)..అధికారులు. దీంతో ఈ వ్యాధికి కారణలేంటన్న అంశాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. రిపోర్టు రానున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా 2020, డిసెంబర్ 05వ తేదీన ఏలూరులో వింత వ్యాధి సోకడంతో వందల సంఖ్యలో జనాలు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోనే ఆ సంఖ్య 600 దాటింది. ఫిట్స్ రావడంతోపాటు, స్పృహ కోల్పోవడం, వాంతులు, కడుపులో నొప్పి, నరాలు లాగడం, నురక కక్కడంలాంటి లక్షణాలతో జనాలు ఆస్పత్రుల్లో చేరారు. రాష్ట్రప్రభుత్వ సంస్థలు, జాతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించాయి.
వాటర్ సమస్యేనని పుకార్లు రావడంతో నీటి నమూనాలు సేకరించారు. వాటర్ మేనేజ్మెంట్ అధికారులు, పుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఎన్ఐఎన్, మంగళగిరి ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్, ఎన్సీడీసీలాంటి జాతీయ స్థాయి సంస్థల బృందాలు ఏలూరు నగరంలో శాంపిల్స్ సేకరించాయి. వాటర్, ఆహార పదార్థాలతోపాటు…. కల్చర్, రోగుల బ్లడ్ శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపాయి. ఢిల్లీ AIMS నుంచి ఫైనల్ రిపోర్ట్లు ప్రభుత్వానికి అందనున్నాయి. దీంతో ఈ వ్యాధి మిస్టరీ వీడనుంది.