ఏపీ ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజుల ఖరారు

ఏపీ ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజుల ఖరారు

Engineering And Pharmacy Fees : ఆంధ్రప్రదేశ్‌లో బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వురుగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ విద్యాసంస్థల్లో కోర్సులకు ఫీజులను ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ (APHERMC) సిఫార్సులను అనుసరించి ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఫీజుల ఉత్తర్వులను విడుదల చేశారు. 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో మెరైన్‌ ఇంజనీరింగ్‌ ఫీజు రూ.1.25 లక్షలుగా ఖరారు చేసింది.

బీటెక్, బీఆర్క్‌ కోర్సులకు కనిష్టం రూ.35 వేల నుంచి గరిష్ట ఫీజు రూ.70 వేలుగా నిర్ణయించారు. 240 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 4 బీఆర్క్‌ కాలేజీలతోపాటు 1 మెరైన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి ఖరారు చేసిన ఫీజులు వర్తిస్తాయి. సంబంధిత కాలేజీలు సమర్పించిన వివిధ పత్రాలను ఆడిట్‌ చేసిన తర్వాత యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆయా సంస్థలకు కోర్సుల వారీగా ఫీజులను సిఫార్సు చేసింది. దీన్ని అనుసరించి ఉన్నత విద్యా శాఖ ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బీటెక్, బీఆర్క్‌ కోర్సుల్లో 8 కాలేజీలకు రూ.70 వేల చొప్పున ఫీజులు ఖరారు చేసింది. రూ.35 వేలకుపైగా రూ.70 వేల లోపు ఫీజులు ఖరారైన కాలేజీలు 94 ఉన్నాయి. 142 కాలేజీలకు కనిష్ట ఫీజు రూ.35 వేలుగా నిర్ణయించారు. బీ.ఫార్మసీకి సంబంధించి గరిష్ట ఫీజును రూ.65,900గా నిర్ణయించారు. కనిష్ట ఫీజును రూ.35 వేలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం రాష్ట్రంలోని 113 కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. గరిష్ట ఫీజు ఖరారైన కాలేజీ ఒకటి మాత్రమే ఉంది. అలాగే రూ.35 వేల నుంచి రూ.65 వేల వరకు ఫీజులు నిర్ణయమైన కాలేజీలు 55 వరకు ఉన్నాయి. 57 కాలేజీలకు రూ.35 వేల కనిష్ట ఫీజు ఖరారైంది.

అన్నిరకాల రుసుములతోనే ప్రభుత్వం ఈ ఫీజులను ఆయా సంస్థలకు నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికంటే ఎక్కువ మొత్తంలో విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. క్యాపిటేషన్, డొనేషన్, మరే ఇతర ఫీజులను పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ వసూలు చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. యూనివర్సిటీలు గుర్తింపు ఇవ్వని కాలేజీలు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. ఈ ఫీజులను పూర్తిగా ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్‌ చేయనుంది.