తపశ్శక్తితో రుద్రాక్షలను మహిమాన్వితం చేస్తాం అంటూ మోసం చేసిన దొంగ బాబాలు
fake swamiji cheating farmers and escaped with money and gold chittoor district : ప్రజలు కష్టాన్ని నమ్ముకుని సంపాదించుకుంటూ కూడా, ఇంకా తేలికగా డబ్బు సంపాదించటానికి, అదృష్టం వరించటానికి బాబాలను, సాములోర్లను నమ్ముతుంటారు. దొంగబాబాలను నమ్మి బంగారం సమర్పించుకున్న ఇద్దరు అన్మదమ్ముల కధ చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.
తిరుపతికి చెందిన రామాయణం మురళీ, విశ్వనాధ్ అనే అన్నదమ్ములు రోజు మదనపల్లె మార్కెట్ లో టమాటాలు కొని తీసుకు వెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. రోజు మాదిరిగానే మదనపల్లె వచ్చి టామోటాలు కొని తిరుగు ప్రయాణమయ్యారు. వారికి మార్గమధ్యలో తట్టివారి పల్లె జంక్షన్ వద్ద ఆరుగురు స్వామీజీల బృందం కనిపించింది.
దైవభక్తి పరాయణులైన అన్నదమ్ములు అక్కడ ఆగి స్వామీజీలతో సంభాషించారు. వారంతా45-60 ఏళ్ల మధ్య వయస్సున్న రాజస్ధానీ స్వామీజీలు. వారి వస్త్రధారణ ముఖాలు చూడగానే మహిమగల స్వామీజీలు గా గుర్తించారు. అన్నదమ్ముల మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి పూజలో పెడితే హిమాలయాల్లో పొందిన జ్ఞానశక్తితో వాటిని మహిమాన్వితమైన వాటిగా చేస్తామని, తద్వారా అష్టైశ్వర్యాలు సిధ్దిస్తాయని నమ్మబలికారు. దీంతో వారు సమీపంలోని తమ బంధువుల ఇంటికి స్వామీజీలను తీసుకువెళ్లారు.
అక్కడ స్వామీజీలు చెప్పినట్లు 20 వేలు రూపాయలతో పూజా సామాగ్రి సమకూర్చారు. నెయ్యి, కర్పూరం, కొబ్బరి కాయలు, నిమ్మకాయలు, కుంకుమ, అగరబత్తీ వంటి పూజాసామాను తెప్పించారు. హోమ గుండం ఏర్పాటు చేశారు. పూజ మొదలెట్టారు. అన్న దమ్ముల మెడలోని బంగారు రుద్రాక్ష మాలలు పూజలో పెట్టమని చెప్పారు. తమ మెడలోని 60 గ్రాములు బంగారు రుద్రాక్ష మాలతోపాటు, 20 వేల రూపాయలను వారికి ఇచ్చి పూజలో పెట్టించారు.
స్వామీజీలు హిందీలో మంత్రాలు చదువుతూ హోమం చేయసాగారు. మధ్య మధ్యలో కొబ్బరి కాయలు కొడుతూ, కుంకుమ జల్లుతూ, సాంబ్రాణి ధూపం వేస్తూ షోని రక్తి కట్టించారు. ఇంట్లో ధూపం వేస్తూ ఒక్కోక్క స్వామీజి బయటకు వచ్చారు. ధూపం వాసన పీల్చిన అన్నదమ్ములు స్పృహ కోల్పోయారు. ఆ సమయంలో స్వామీజీలు అందరూ ఇంట్లోనుంచి ఉడాయించార. అన్నదమ్ములిద్దరూ తేరుకుని చూసే సరికి స్వామీజీల మాయం అయ్యారు. ఒరిజినల్ బంగారు రుద్రాక్ష మాల స్ధానంలో నకిలీ రుద్రాక్షమాల కనిపించింది. అక్కడ పెట్టిన డబ్బు మాయం అయ్యింది.
లబో దిబో మంటూ అన్నదమ్ములిద్దరూ పోలీసు స్టేషన్ కు బయలు దేరారు. రోడ్డుపై టాఫిక్ విధుల్లో ఉన్న రూరల్ పోలీసుల ద్వారా సీఐ.ఎస్సైలకు రాజస్థానీ ముఠా చేసిన మోసాన్ని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఉపయోగించన కారు బెంగుళూరు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆదిశగా దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో ఉంది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు.