చేపల కూర లొల్లి : ఒకరి హత్య, ఏడుగురు జైలుపాలు

చేపల కూర లొల్లి : ఒకరి హత్య, ఏడుగురు జైలుపాలు

Fight Over Fish Curry : అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల కూర చిచ్చుపెట్టింది. ఒకరి హత్యకు దారి తీసింది. నిందితుడితో పాటు ఏడుగురిని జైలుపాలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర కోసం ఓ వ్యక్తి అరాచకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి ఒక వ్యక్తిని మర్డర్ చేశారు. అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ విషయం తెలిసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. చేపల కూర విషయంలో గొడవ జరగగా, స్నేహితులే అతడిని హత్య చేసినట్లు నిర్థారించారు.

కాకినాడకు చెందిన పాండురంగడు కొంతకాలంగా అవలింగిలో నివాసం ఉంటున్నాడు. రక్షితనీటి పథకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్లి.. ఇటీవల తనతో పాటు కాకినాడ నుంచి పాలమూరు ప్రసాద్‌ను అవలింగి తీసుకొచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరితో కలిసి ఆదే రోజు రాత్రి చేపల కూర చేసుకున్నారు. తినడానికి ముందు మద్యం తాగారు. తర్వాత చేపల కూర దగ్గరకు వచ్చేసరికి పాండురంగడుకు, ప్రసాద్‌కు గొడవ తలెత్తింది.

కూర విషయంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ముక్కల దగ్గర లొల్లి స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో సహనం కోల్పోయిన పాండురంగడు మంచం కోడుతో ప్రసాద్‌ తల, చేతులపై తీవ్రంగా కొట్టాడు. పాండురంగడు దెబ్బలకు ప్రసాద్‌ స్పాట్‌లోనే చనిపోయాడు. దీంతో దిక్కుతోచని పాండురంగడు స్థానికుల సహాయంలో మృతదేహాన్ని చెత్త సేకరణ బండిలో తీసుకొని వెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు.

ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తహసీల్దార్‌ రాజమోహన్‌ సమక్షంలో ప్రసాద్‌ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం కోసం పాతపట్నం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడకు చెందిన ఒక కాంట్రాక్టర్‌, గ్రామానికి చెందిన మరో ఐదుగురి సహకారంతో ప్రసాద్‌ మృతదేహాన్ని పాండురంగడు ఖననం చేశాడని గుర్తించారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని సారవకోట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.