Delta Plus Variant : తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు.. 16 మందిని కలిసిన బాధితుడు
తిరుపతిలో తోలి డెల్టాప్లస్ వేరియంట్ కేసు వెలుగుచూసింది. బాధితుడు మరో 16 మందితో కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు వైద్యులు. దీంతో వారందరి శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపారు.
Delta Plus Variant : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తోలి డెల్టాప్లస్ కేసులు వెలుగుచూసింది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డెల్టాప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి ప్రాథమిక కాంట్రాక్టులుగా 16 మందిని గుర్తించారు. వీరి నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఒకటి సీసీఎంబీకి మరొకటి, స్విమ్స్ కు పంపారు అధికారులు. జిల్లా వైద్యాధికారి శ్రీహరి డెల్టాప్లస్ వైరస్ కేసు వెలుగుచూసిన ప్రాంతాల్లో పర్యటించి ఫీవర్ సర్వేపై పలు సూచనలు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్యాంగా ఉన్నారని శ్రీహరి తెలిపారు. ఈ వేరియంట్ కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని.. కానీ ఎవరు భయపడాల్సిన పనిలేదని తెలిపారు. ఇక ఏప్రిల్ మే నెలల్లో లక్షల్లో నమోదైన కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ లో సడలింపు చేశాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేశాయి. ఇదే సమయంలో డెల్టాప్లస్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ వైరస్ గతేడాది దేశంలో కనిపించిన డెల్టా వైరస్ ఫ్యామిలీకి చెందిందే.. ఇక దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఇప్పటికే డెల్టాప్లస్ వైరస్ పై జాతీయ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు రాశారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ఇక శనివారం తమిళనాడులో ఓ కేసులు వెలుగు చూసింది. మద్యప్రదేశ్ లో డెల్టాప్లస్ వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు.