తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

AP panchayat elections : హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి నోటిఫికేషన్ ను ఎన్నికల అధికారి నిమ్మగడ్డ విడుదల చేశారు. తొలి విడత ఎన్నికల్లో ప్రకాశం, విజయనగరం జిల్లాలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని, 11 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 11 జిల్లాల్లోనూ రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమైందన్నారు.

2021, జనవరి 23వ తేదీ శనివారం ఉదయం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఆయన తెలియచేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపిందన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం, విధేయత ఉందన్నారు.  అనివార్య కారణాలతో ఆలస్యమైన ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో చేపట్టడం జరుగుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో వివాదాలు దాదాపు ముగిసినట్లు చెప్పారాయన. సుప్రీంకోర్టు తీర్పు వస్తే..దాని ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. సీఎస్, డీజీపీలతో తనకు మంచి సంబంధాలున్నాయని..వీరు పరిణితి చెందిన అధికారులన్నారు.

అయితే పంచాయతీ రాజ్ శాఖ మెరుగైన పనితీరు కనబరచాలని, పంచాయతీ రాజ్ కమిషనర్, పంచాయతీ రాజ్ సెక్రటరీ పూర్తిగా విఫలం చెందారనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. 2018 ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు హైకోర్టుకు తాము చెప్పడం జరిగిందన్నారు. విధిలేని పరిస్థితిల్లో 2019 జాబితాను పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ జాబితాను 2019 జాబితాను పరిగణలోకి తీసుకోవడం వల్ల 3.6 లక్షల మంది కొత్త ఓటర్లకు అవకాశం కల్పించలేకపోయామన్నారు. ఈ విషయంలో పంచాయతీ రాజ్ శాఖపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. చీఫ్ సెక్రటరీ రాసిన లేఖ నా కంటే ముందుగానే మీడియాకు చేరిందని, ఎన్నికల నిర్వాహణ మీద భిన్నస్వరాలు ఉన్నా..సక్రమంగానే జరుగుతాయని స్పష్టం చేశారు అధికారి నిమ్మగడ్డ.