ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి : సీఎం జగన్

కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 04:18 PM IST
ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి : సీఎం జగన్

కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కరోనా నివారణ చర్యలపై మంగళవారం (ఏప్రిల్ 21, 2020) క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సందర్బంగా గుజరాత్ లో చిక్కుకుపోయిన తెలుగు మత్య్సకారుల కోసం గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడానని పేర్కొన్నారు. తెలుగు మత్య్సకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని తనతో చెప్పారని వెల్లడించారు. పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటను సరైన ధరకు కొనుగోళ్లు చేసిన వారికి అండగా నిలబడాలన్నారు.

అంతకు ముందు కరోనా నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుందన్నారు. రెడ్, ఆరెంజ్ జోన్ల వారిగా మాస్క్ లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా నిలిచాయని, ఇంతవరకు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 225 ట్రూనాట్ కిట్స్ తో విస్తారంగా కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కాగా సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కరోనా పరీక్షలను (ర్యాపిడ్ టెస్టులు కాకుండా) నిర్వహించామన్నారు. కర్నూలు జీజీహెచ్ ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించామని, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉన్నవారిని మిగతా ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.

కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పీపీఈ కిట్లు, మాస్క్ లను ఎక్కువ స్టాక్ లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందిలో ఇప్పటికే 2వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్వారంటైన్ సెంటర్ల లో ఇప్పటి వరకూ 7100 మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.