టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. లోకేష్ సీటు నుంచేనా?
ఇప్పటివరకు బీమిలి నుండి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా బీమిలి నుండి అనూహ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో లోకేష్ విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రధానంగా వినిపించిన పేరు జేడీ లక్ష్మీనారాయణ. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఆయన గతకొంతకాలంగా పార్టీ పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి.
రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఇదే క్రమంలో తెలుగుదేశం ఆయనతో చర్చలు జరపగా సీటుపై ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇప్పటికే భేటి అయిన లక్ష్మీనారాయణ రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సామాజిక వర్గాల పరంగానూ.. రాష్ట్రవ్యాప్త ప్రచారంలోనే లక్ష్మీనారాయణ పార్టీకి పనికి వస్తాడనే ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తుంది.