ఏపీలో శానిటైజర్ టెర్రర్..తిరుపతిలో నలుగురు మృతి
ఏపీలో ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుంటే..మరోవైపు..వైరస్ ను కట్టడి చేసేందుకు ఉపయోగించే శానిటైజర్ తాగి పలువురు చనిపోతున్నారు. మత్తు కోసం వీటిని తాగుతున్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నరు కొంతమంది.
తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శానిటైజర్ తాగి నలుగురు చనిపోయారు. వీరంతా కార్మికులని తెలుస్తోంది. శ్రీనివాసులు, బీరయ్య, వెంకటరత్నం, కుమార్ గా గుర్తించారు. దీంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్యానికి అలవాటు పడిన వారు..ఎలాంటి శానిటైజర్లు, మత్తు పదార్థాను తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మత్తుకు బానిసైన కొంతమంది శానిటైజర్ ను నీళ్లలో కలుపుకుని తాగి ప్రాణాలు వదులుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజ్ తాగి 10 మంది మృతి చెందిన ఘటన మరిచిపోకముందే..కడపలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయారు. ఇదే గ్రామంలో మరో 10 మంది శానిటైజర్ సేవించినట్లు తెలుస్తోంది. కురిచేడు ఘటన తర్వాత..మందుబాబుల్లో మార్పు రావడం లేదు.
పెరిగిన మద్యం ధరలు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంత డబ్బు పెట్టి మద్యం కొనలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే కోవలో మద్యానికి బదులుగా స్పిరిట్, శానిటైజర్లు తాగి ఏపీలో ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్లను మత్తు కోసం కొంతమంది వాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం స్పిరిట్, శానిటైజర్లను సేవించడం ప్రాణాంతకమని, అలాగే మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది.