విహారయాత్రలో విషాదం
bus crash in Araku Valley : ఆధ్యాత్మిక, విహార యాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్లోని షేక్ పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 25 మంది ఈ నెల 10వ తేదీన దినేష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. నిన్న ఉదయం అరకు అందాల్ని ఆస్వాదించారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి సింహాచలం బయలుదేరారు.
అప్పటివరకు సరదాగా సాగిన ఆ విహార యాత్రలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. రాత్రి 7 గంటల సమయంలో అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. ఒక్కసారిగా 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లిపోయింది. చిమ్మచీకటి కావడంతో.. ఏం జరుగుతుందో ఊహించేలోగా విషాదం అలముకుంది. లోయలోంచి హాహాకారాలు వినిపించడంతో.. వెనుక వస్తున్న పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. వెంటనే బొర్రా గుహల్లో పని చేస్తున్న సిబ్బంది అక్కడి చేరుకుకొని పోలీసులు, ప్రయాణికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తిగా చీకటిగా ఉండటంతో బస్సులోంచి క్షతగాత్రుల్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే.. నలుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారందరినీ హుటాహుటిన ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు అధికారులు. ప్రమాదం గురించి తెలియగానే మంత్రి అవంతి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలించారు.
ప్రమాద బాధిత మహిళ
డ్రైవర్ తప్పిందం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని ప్రమాద బాధిత మహిళ చెబుతోంది. దినేశ్ ట్రావెల్స్ మంచి డ్రైవర్ను పంపలేదని.. ఆ డ్రైవర్కు సరిగా డ్రైవింగ్ రాదని చెబుతోందామె. హైదరాబాద్ నుంచి వెళ్తుంటేనే తమను తిప్పలు పెట్టాడని వాపోయింది. డ్రైవర్కు ఘాట్ రోడ్డు డ్రైవింగ్ రాదని చెప్పాడని.. అరకులో స్టే చేద్దామని చెప్పినా వినలేదని చెప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్కు పర్మిషన్ ఇవ్వొద్దన్నారు. బస్సులో మొత్తం 26 మంది ఉన్నామని తెలిపారు. తమది హైదరాబాద్ మణికొండ దగ్గర నివాసం అని చెబుతోంది. ముందు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నాం..అక్కడి నుంచి అరకు వెళ్లామని తెలిపింది. డ్రైవర్కు ఘాట్ రోడ్డు డ్రైవింగ్ రాదు..అరకులో స్టే చేద్దామని చెప్పినా డ్రైవర్ వినలేదని చెప్పింది. బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పినా ఆపలేదు.. అందరం అరుస్తున్నాం.. బస్సు లోయలోకి వెళ్లిపోయిందని పేర్కొంది.