గంగవరం.. అదానీపరం: దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా

గంగవరం.. అదానీపరం: దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా

Gangavaram Port: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు అయిన గంగవరాన్ని అదానీ గ్రూప్ దక్కించుకోనుంది. దేశంలోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించేదిశగా అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. వార్‌బర్గ్‌ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌ మెంట్‌ నుంచి …19వందల 54 కోట్లతో 31.5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.

ఈ ఒప్పందంతో గంగవరం పోర్టు కంపెనీలో 16.3 కోట్ల షేర్లు ఏపీ ఎస్‌ఈజెడ్‌ చేతికి రానున్నాయి. ఒక్కో షేరును 120 రూపాయలతో కొనుగోలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పన్నెండు ప్రాంతాల్లో అదానీ సంస్థకు పోర్టులున్నాయి. ఈ ఒప్పందంతో పోర్టుల్లో అదానీల మార్కెట్‌ షేర్‌ 30శాతానికి పెరగనుంది. 31.5శాతం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న అదానీ గ్రూప్ పోర్టులో మెజార్టీ వాటాను చేజిక్కించుకునేదిశగా ప్రయత్నాలు చేస్తోంది. గంగవరం పోర్టులో డీవీఎస్‌ రాజు వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోంది.

డీవీఎస్ రాజుకు, ఆయన కుటుంబానికి 51.8శాతం వాటా ఉంది. ప్రభుత్వానికి 10.4శాతం వాటా ఉంది. తూర్పు తీరంలో పోర్టులను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్న అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలోని మరో పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని 12వేల కోట్లతో కొనుగోలు చేసింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టుల కొనుగోలుతో ఏపీ సముద్ర తీరంపై అదానీ పోర్ట్స్‌ ఆధిపత్యం సాధించినట్టయింది.

దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా
గత నెలలో మహారాష్ట్రలోని డిఘి పోర్టును కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ ఇప్పుడు గంగవరం కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పోర్ట్‌ అండ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ నిర్మాణంలో భాగంగా గంగవరం పోర్టు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా అదానీ గ్రూప్‌దే. అదానీల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ పోర్టు ఉంది. 2006లో పది మిలియన్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఒక పోర్టుకు అధిపతిగా ఉన్న అదానీ ఇప్పుడు 498 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 12 పోర్టుల అధిపతిగా అవతరించారు.

విదేశాల్లోనూ
దేశీయంగానే కాదు..పొరుగు దేశాల్లోనూ పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవలే శ్రీలంక ప్రభుత్వంతోనూ అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. కొలంబో పోర్టుకు సంబంధించి వెస్ట్ కంటెయినర్‌ టెర్మినల్‌ను నిర్మించి, 35 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీలంక పోర్టు అధారిటీతో తాజాగా అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఏపీలో రెండో అతిపెద్ద పోర్టు అయిన గంగవరం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అతి దగ్గరగా ఉంటుంది. దీని సామర్థ్యం 64 మిలియన్ టన్నులు. అన్ని సీజన్లలో రవాణాకు ఈ పోర్టు అనుకూలంగా ఉంటుంది. లోతు ఎక్కువ. రెండు లక్షల డెడ్‌ వెయిట్ టన్నుల సామర్థ్యం ఉండే భారీ సూపర్ కేప్ సైజ్ ఓడలు కూడా ఈ పోర్టుకు రాకపోకలు సాగించగలవు.

పోర్ట్ కేంద్రంగా వ్యాపార నిల్వలు
బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, స్టీల్ సహా అన్ని రకాల ముడి సరుకులను భారీ ఎత్తున రవాణా చేయవచ్చు. ప్రస్తుతం గంగవరం పోర్ట్ లిమిటెడ్‌ 9 బెర్త్‌లను ఆపరేట్ చేస్తోంది. 1,800 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని 31 బెర్తులతో 250 మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించవచ్చు. ప్రస్తుతం తాము మైనార్టీ షేర్ హోల్డర్లుగా ఉన్నామని, మెజారిటీ షేర్ హోల్డర్లగా మారిన వెంటనే పోర్టును దాని సామర్థ్యానికి తగ్గట్టుగా 250 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని కరన్ అదానీ చెప్పారు.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పోర్టు కార్గో వాల్యూమ్ 34.5 మిలియన్ టన్నులు. వెయ్యీ 82 కోట్ల ఆదాయం లభించింది. పోర్టుకు గంగవరం పోర్ట్‌కు ఎలాంటి అప్పులూ లేవు. 500 కోట్ల మిగులు ఆదాయం ఉంది.