తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త, ఉగాది నుంచి అనుమతి

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త, ఉగాది నుంచి అనుమతి

good news for tirumala devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం (ఏప్రిల్ 14) నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉదయం డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని చెప్పిన ఆయన.. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని, నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తామని.. ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు 22వేల టోకెన్లు జారీ చేస్తున్నామని.. అంచెలవారిగా సర్వదర్శనం టోకెన్లు రూ.40వేలకు పెంచుతామని జవహర్ రెడ్డి చెప్పారు. ఆర్జిత సేవలకు భక్తులు నేరుగా పాల్గొనవచ్చు.

అలాగే, ఏప్రిల్ 15 తర్వాత వయోవృద్ధులు, చిన్న పిల్లలకు దర్శనాలను ప్రారంభించాలన్న యోచనలో ఉన్నామని జవహర్ రెడ్డి తెలిపారు. దాతలు సూచించిన వారి కుటుంబీకులు, మిత్రులకు దర్శనాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉచిత దర్శనం టోకెన్ల కోటాను దశలవారీగా రోజుకు 40 వేలకు పెంచాలని భావిస్తున్నామని, తిరుమలకు వచ్చే వారంతా కరోనా నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు.

కరోనా కారణంగా వర్చువల్‌లో ఆర్జిత సేవల్ని టీటీడీ నిర్వహిస్తోంది. మార్చి నెల వర్చువల్‌ టికెట్ల కోటా ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లు ఉన్నాయి. టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇంటి నుంచే వర్చువల్‌ విధానంలో సేవల్లో పాల్గొంటారు.

మరోవైపు శ్రీవారి కల్యాణోత్సవం టికెట్టు పొందిన గృహస్థులు ఇద్దరికి ఉచితంగా స్వామివారి ప్రత్యేక ప్రవేశదర్శనం కల్పిస్తారు. వీరు టికెట్లు బుక్‌ చేసుకున్న 90 రోజుల లోపు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల వర్చువల్‌ టికెట్లు పొందిన భక్తులు మార్చి 31లోపు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా తగిన రుసుము చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఉగాది నుంచి భక్తులు నేరుగా ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చు.

ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ శ్రీవారి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ తరఫున గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ కేంద్రానికి లేఖను రాశామని తెలిపారు. తిరుమలలో భౌతికదూరం, మాస్క్ లను ధరించడం వంటి నిబంధనలను భక్తులంతా విధిగా పాటించాలని ఈవో సూచించారు.