High Tension In Kuppam : కుప్పంలో హైటెన్షన్.. పోలీసులు వర్సెస్ టీడీపీ కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్.గొల్లపల్లి దగ్గర టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
High Tension In Kuppam : టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్.గొల్లపల్లి దగ్గర టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. 10 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. లాఠీచార్జిలో మహిళా కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు. కర్నాటక సరిహద్దు వైపు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.
చంద్రబాబు కుప్పం టూర్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఓవైపు చంద్రబాబు టూర్ కోసం టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు సీజ్ చేసిన ప్రచార రథాన్ని విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read..Andra pradesh : కుప్పంలో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు
చంద్రబాబు పర్యటించనున్న శాంతిపురం మండలంలో భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు రచ్చబండ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ ను పోలీసులు తొలగించారు. కుప్పం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా చంద్రబాబు సభ నిర్వహించాలనే పట్టుదలతో టీడీపీ నేతలు ఉన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో రోడ్ షోలు, సభలకు ప్లాన్ చేశారు చంద్రబాబు.
మరోవైపు శాంతిపురం మండలం గడ్డూరు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి వాహనాలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అక్కడి నుంచి ఎత్తుకెళ్లి రోడ్డు పక్కన పొదల్లోకి విసిరేశారు.
మరోవైపు ఏపీలో రాజకీయ పార్టీల ర్యాలీల, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న జీవోపై ఉద్యమానికి సిద్ధమవుతోంది టీడీపీ. జీవోకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, సభలకు వస్తున్న జనాలను చూసి ఓర్చుకోలేకనే ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా మండిపడ్డారు.