జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట, రేషన్ డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట, రేషన్ డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్

highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. మార్చి 15వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది.

రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. కాగా, పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభోత్సవం రద్దైంది. ఫిబ్రవరి 1న అనంతపురం జిల్లా కదిరిలో సీఎం జగన్ పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి కొత్త పథకాలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఏడాది నుంచి వాయిదా పడుతోంది ఈ కార్యక్రమం. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్ డౌన్, ఆ తర్వత కొత్త కార్డుల మంజూరు వంటి పనులు ఆలస్యం కావడంతో పథకం ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.

రేషన్ డోర్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9260 వాహనాలను జనవరి 21 ప్రారంభించింది. ఈ వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాల అందించింది. ఇప్పటికే వాహనాలన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు చేరుకున్నాయి.

వాహనంలోనే అన్ని సౌకర్యాలు
టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోనే సరుకులు తూకం వేసే కాంటాను అమర్చి.. ఇంటి దగ్గరే లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళితే.. అక్కడి లబ్దిదారులకు తెలిసే విధంగా ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఒక్కో డోర్ డెలివరీ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు సరకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 20 రోజులు వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది.