ప్రేమ పెళ్లి చేసుకుందని నోట్లో పురుగుల మందు పోసి హత్యాయత్నం, పరువు కోసం బంధువుల దాష్టికం

ప్రేమ, ఆప్యాయత, బంధుత్వం కన్నా వారికి పరువే ముఖ్యమైంది. పరువు కోసం దారుణానికి ఒడిగట్టారు. నిండు ప్రాణాన్ని తియ్యబోయ్యారు. బలవంతంగా పురుగుల మందు నోట్లో పోసి హత్య చేయాలని చూశారు.

ప్రేమ పెళ్లి చేసుకుందని నోట్లో పురుగుల మందు పోసి హత్యాయత్నం, పరువు కోసం బంధువుల దాష్టికం

Honour Kill Attempt In Nellore District

honour kill attempt in nellore district: ప్రేమ, ఆప్యాయత, బంధుత్వం కన్నా వారికి పరువే ముఖ్యమైంది. పరువు కోసం దారుణానికి ఒడిగట్టారు. నిండు ప్రాణాన్ని తియ్యబోయ్యారు. బలవంతంగా పురుగుల మందు నోట్లో పోసి హత్య చేయాలని చూశారు.

తమ మాట ధిక్కరించి ప్రేమ వివాహం చేసుకుందన్న ఆవేశంతో యువతి పుట్టింటి వాళ్లు నవ దంపతులపై దాడికి పాల్పడ్డారు. చివరకు ఆమెను చంపైనా తమ పరువు కాపాడుకోవాలనుకునే దుర్మార్గపు ఆలోచన చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన మంగళవారం(మార్చి 9,2021) నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంగసానిపల్లి సమీపంలో జరిగింది.

సింగారెడ్డిపల్లికి చెందిన బాలకృష్ణ, దేవమ్మచెరువు గ్రామానికి చెందిన అనిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మార్చి 5న ఇంట్లోవారికి తెలియకుండా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదేరోజు తమ కుమార్తె కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు సీతారామపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు.. అనిత ఆళ్లగడ్డలో ఉందని తెలుసుకున్నారు. పోలీసులు అనిత, బాలకృష్ణలను మంగళవారం సీతారామపురం తీసుకొచ్చారు. తహసీల్దార్‌ వెంకటసునీల్‌ ముందు హాజరుపరిచారు. అలాగే ఇరువర్గాల పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడం, తన భర్తతో వెళతానని అనిత చెప్పడంతో వారిని బాలకృష్ణ ఇంటికి పంపించారు పోలీసులు.

అనంతరం ప్రేమ జంట వరుడి ఇంటికి ఆటోలో బయల్దేరగా.. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కారులో వారిని వెంబడించారు. సంగసానిపల్లి సమీపంలో ఆటోను అడ్డగించి దంపతులపై దాడి చేశారు. యువతి నోట్లో పురుగుల మందు పోసి హత్యకు యత్నించారు. అదే సమయంలో బాలకృష్ణ బంధువులు, పోలీసులు రావడంతో పరారయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనితను 108 వాహనంలో ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనిత బంధువులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.