ఒంగోలులో పట్టపగలే యువకుడి దారుణ హత్య

ఒంగోలులో పట్టపగలే యువకుడి దారుణ హత్య

Husband killed wife”s lover, ongole : ప్రకాశం జిల్లా ఒంగోలులో పట్టపగలే దారుణ హత్య జరిగింది. రంగరాయుడు చెరువు సమీపంలోని గాంధీపార్కు వద్ద ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. హత్య చేసిన వారు వెంటనే పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఒంగోలులోని సిరికళ షాపింగ్ మాల్ లో పని చేస్తున్న థామస్ అనే వ్యక్తికి అక్కడే పని చేస్తున్న వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.

ఈ విషయం ఆమె భర్త జోసెఫ్ కు తెలిసిపోయింది. ఈ కారణంగా కుటుంబంలో కలతలు రేగాయి. తరచూ ఇద్దరూ గొడవ పడసాగారు. గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. థామస్ ను అంతం చేయాలని  నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం థామస్ ను గాంధీ పార్కు వద్దకు రమ్మని ప్రియురాలు ఫోన్ చేసి చెప్పింది. ప్రియురాలు ఫోన్ తో ఉత్సాహంగా థామస్ గాంధీ పార్కు వద్దకు వెళ్లాడు.

అక్కడ అప్పటికే మాటు వేసి ఉన్న ఆమె భర్త థామస్ ను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. అనంతరం దంపతులిద్దరూ సమీపంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.