జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి

జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్, చంద్రబాబు బీసీలను ముఖ్యమంత్రి చేయగలరా? అని ప్రశ్నించారు సోమువీర్రాజు. బీసీలు వెనకాల బీజేపీ నడుస్తోందని ఒక బీసీని ప్రధాన మంత్రిని చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకొచ్చారు.

బీసీలను ముఖ్యమంత్రి చేయగల దమ్ము భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీజేపీ నేతల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు సిమెంట్ గనులు కావాలి. పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చేయరా? అని నిలదీశారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు బీజేపీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. వైసీపీ, టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. భద్రాచలం తెలంగాణకు వెళ్లడం వల్ల రాయలసీమకు 200 టీఎంసీల నష్టం కలిగిందని అన్నారు.