అవసరమైతే..పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం : ఏపీ ఎన్జీవో

అవసరమైతే..పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం : ఏపీ ఎన్జీవో

AP NGO : పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్జీవో సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే..ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తామని తెలిపారు. అద్దం చాటున దాక్కొని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారని, ఆయన మాత్రం క్షేమంగా ఉండాలి..ఉద్యోగుల ప్రాణాలు బలి పెట్టాలని అని సూటిగా ప్రశ్నించారాయన. అధికారులపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం న్యాయం కాదన్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటీషన్ పై ఇంప్లీడ్ పిటీషన్ వేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులందరూ ఒకేతాటిపై ఉన్నారని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత..ఎన్నికల ప్రక్రియ జరపాలని మరోసారి సూచించారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా..11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలపై పలు కామెంట్స్ చేశారు. దీనిని ఆయా ఉద్యోగ సంఘాలు ఖండించాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కరోనా అనేది భయంకరమైన వ్యాధి కావడంతో అందరిలో భయాలున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అద్దం చాటున ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారని, ఎలాంటి ప్లాన్ లేకుండా..చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు 24 గంటల పాటు పనిచేస్తే గాని..సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు వినాలే గాని..ఏకపక్షంగా వ్యవహరించవద్దన్నారు. నెల రోజుల పాటు మాత్రమే ఆయన పదవిలో ఉంటారని, అంతా గందరగోళంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు.