విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

Visakhapatnam steel plant : విశాఖ ఉక్కు ప్లాంట్ ను కాపాడుకుంటామని జనసేన ప్రకటించింది. ప్రజల విజ్ఞాపనను కేంద్రానికి తెలియజేస్తామని పేర్కొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమన్న జనసేన.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32మంది ప్రాణత్యాగం చేశారని తెలిపింది. త్యాగాలతో ఆవిర్భవించిన కర్మాగారం చేతులు మారడం ఆమోదయోగ్యం కాదంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేరుతో లేఖ విడుదల చేసింది. ప్రైవేటు పరం చేయాలనుకున్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని.. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలను పవన్ కోరుతారని జనసేన తన లేఖలో పేర్కొంది. ఢిల్లీ వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను పవన్‌ కల్యాణ్‌ ప్రధానికి తెలియజేస్తారని ప్రకటించింది.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సమర్థించారు. మాస్టర్‌ పాలసీలో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యాపారాలు చేయడం ప్రభుత్వ విధానం కాదని తెలిపారు. ఇది వైసీపీనో లేకపోతే తెలుగుదేశం పార్టీనో విభేదిస్తే ఆగిపోదన్నారు. ప్రైవేటీకరణ వలన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎక్కడికి వెళ్ళదని, అక్కడే ఉంటుందని తెలిపారు. వేరే రాష్ట్రానికో లేక వేరే దేశానికో తరలిపోదన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రాణాలు అర్పించి స్టీల్‌ ప్లాంట్‌ తెచ్చారని వారందరినీ గుర్తు చేసుకోవాలన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. విశాఖలో కార్మికలోకం కదం తొక్కింది. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో రైతు ఉద్యమం కంటే తీవ్రంగా పోరాడతామని కార్మికులు హెచ్చరించారు.