పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్.. ఎన్నికల కోసమే కేసులు వాడుకుంటున్నారు!!

పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్.. ఎన్నికల కోసమే కేసులు వాడుకుంటున్నారు!!

JC Brothers: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరుల దీక్ష వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ సోదరుల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పట్టణంలో పోలీసుల్ని భారీగా మోహరించగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యం చేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతో డీఎస్పీ ఏ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు జాగ్రత్త అంటూ డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు.. దూషిస్తే ఊరుకోమని చెప్పారు. ఇంట్లోకి పోలీసులు వస్తే ఎలా ఊరుకుంటానని దివాకర్ రెడ్డి మండిపడ్డారు.

పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా పెట్టారో వివరించాలి. శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేశారు. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ కేసులో ఎప్పటిలోపు ఛార్జి షీట్ వేస్తారో చూడాలని ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడే కేసులు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

తాడిపత్రిలో ఈనెల 31 వరకు 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుల దాడులు ప్రతి దాడులు.. అరెస్టులతో కొద్దిరోజుల కిందట తాడిపత్రి అట్టుడికింది. ఇంకా అక్కడ సాధారణ పరిస్థితి రావడానికి సమయం పట్టే అవకాశమూ ఉంది. ఈ గొడవల్లో ఇరువర్గాలకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేసినా.. ఇక్కడ ఇంకా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా జేసీ కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో తీవ్రంగా స్పందించిన జేసీ దివాకర్‌రెడ్డి.. తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

తనపై పెట్టిన అట్రాసిటీ కేసును ఉపసంహరించుకునే వరకు ఆమరణ దీక్ష చేస్తానని జేసీ దివాకర్‌ రెడ్డి ప్రకటించడంతో తాడిపత్రిలో హైటెన్షన్‌ నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ అనుచరుల ఘర్షణ తర్వాత పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా దీక్ష చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొవిడ్‌ నిబంధనలు, పోలీసు చట్టం వంటి.. ఎన్ని నిబంధనలు అమల్లో ఉన్నా.. దీక్ష కొనసాగిస్తానని అరెస్టులు చేస్తే చేసుకోండంటూ స్పష్టం చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

తన సోదరుడు జేసీ ప్రభాకరెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వదిలేదిలేదని దివాకర్‌రెడ్డి ప్రకటించారు. దీక్షకు తరలిరావాలని తన అనుచరులు, మద్దతుదార్లకు పిలుపు ఇవ్వడంతో తాడిపత్రికి దారి తీసే అన్ని మార్గాల్లో తనిఖీలు పెంచి కట్టడి చేయాలని పోలీసులు నిర్ణయించారు.

ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు నాలుగు వాహనాలతో వెళ్లడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా లోపాలు బయటపడ్డాయి. అదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోనే ఉండడంతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు సిద్ధమవ్వడంతో.. గ్రామాల్లో కూడా ఇరు పార్టీల నేతల మధ్య టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

జేసీ బ్రదర్స్‌తోపాటు.. వారి తనయులు కూడా పెద్దారెడ్డితో అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పెద్దారెడ్డితోపాటు… కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా జేసీ బ్రదర్స్‌ కథేంటో చూడాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తాడిపత్రిలో ఆందోళన సర్వత్రా నెలకొంది.