కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ దారుణ హత్య

కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ దారుణ హత్య

Kakinada 9th Ward YCP corporator murdered : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో దారుణం జరిగింది. కార్పొరేటర్ కంపర రమేష్ ను నిన్న అర్ధరాత్రి సమయంలో ప్రత్యర్ధులు కారుతో గుద్ది హత్య చేశారు. పాత కక్షలు కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కాకినాడ లో 9వడివిజన్ కు చెందిన వైసీపీ కార్పోరేటర్ కంపర రమేష్ నిన్న రాత్రి సమయంలో వాకపూడి గానుగచెట్టు సెంటర్ లోని ఒక కారు వాష్ షెడ్ వద్ద స్నేహితులు ముత్యాల రమేష్, సుందరవాడ వాసు తో కలిసి మద్యం సేవించటానికి వచ్చారు. వారు ముగ్గురూ కలిసి మద్యం సేవిస్తుండగా, మధ్యలో గురజాల చిన్నా అనే వ్యక్తి కూడా, తన తమ్ముడితో కలిసి మద్యం సేవించటానికి వచ్చాడు.

అందరూ మద్యం సేవించి ఇళ్లకు వెళ్లేప్పుడు రమేషా కారు తాళాలు కనిపించక పోవటంతో ఎవరూ ఇక్కడ్నించి వెళ్లవద్దని కోరాడు. కానీ చిన్నా కారు తీసుకుని ముందుకు వెళుతుండగా రమేష్ చిన్నాకారుకు అడ్డం నిలుచున్నాడు. చిన్నా ఆసమయంలో చిన్నా కారును వెనక్కి తీసుకు వచ్చి వేగంగా రమేష్ మీదకు పోనిచ్చి ఢీకొట్టాడు.

దీంతో రమేష్ కిందపడిపోగా రమేష్ మీద నించి కారు ముందుకు పోనిచ్చిన చిన్నా.  మళ్లీ అదే డైరెక్షన్ లో కారును రమేష్ మీదకు ఎక్కిస్తూ వెనక్కి తీసుకు వచ్చాడు. అలా వచ్చిన చిన్నా మరోసారి కారును వేగంగా   రమేష్ మీద నుంచి  ముందుకు పోనివ్వటంతో రమేష్ అక్కడికక్కడే మరణించాడు.

పాత కక్షల నేపధ్యంలోనే ఈహత్య జరిగినట్లు పోలీసులు చెపుతున్నారు. చిన్నా, కంపర రమేష్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహయం చేస్తూ ఉంటాడు. వీరిద్దరికీ సంబంధించి ఒక సెటిల్మెంట్ విషయంలో రమేష్ కి తెలియకుండా నిందితుడు వ్యవహారం నడపడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి.

దీంతో కక్ష పెంచుకున్న అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజిని పరీశిలిస్తున్నారు. రమేష్ మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమేష్ అభిమానులు, స్నేహితులు, బంధువులు, పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు.