Kartika Masotsavam In Srisailam : శ్రీశైలంలో ఈ నెల 26 నుండి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం ఈవో లవన్న పేర్కొన్నారు. కార్తీక మాస పూజల నేపథ్యంలో సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు కలిపి 15 రోజుల పాటు స్వామి వారి స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా నవంబర్ 8వ తేదీ ఉదయం 6:30 గంటల నుండి సాయంకాలం 6:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని లవన్న తెలిపారు.
నవంబర్ 8వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహిస్తామని చెప్పారు. కార్తీక దీపాలను వెలిగించడానికి భక్తుల కోసం గంగాధర మండపం, శివ మాడవీధిలను ఏర్పాటు చేస్తామని ఈవో లవన్న తెలిపారు. శ్రీశైలంలో ఎటువంటి టికెట్ల రేట్లు పెంచలేదని స్పష్టం చేశారు. నూతనంగా ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
నూతన సేవలతో సామాన్య భక్తులు హారతి దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని ఈవో లవన్న తెలిపారు. మహా మంగళహారతి దర్శనాన్ని వ్యాపారం చేసే దళారుల ఆట కట్టించడానికే నూతన సేవలు ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఆలయ ట్రస్ట్బోర్డ్, మంత్రి, దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతితోనే ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించామన్నారు.