10TV రిపోర్టర్పై దాడి చేసిన కఠారి పాలెం మత్స్యకారులు
Kathari Palem fishermen attacking 10TV reporter : ప్రకాశం జిల్లా కఠారీ పాలెం వద్ద ఇరువర్గాల ఘర్షణను చిత్రీకరిస్తున్న 10టీవీ చీరాల రిపోర్టర్పై మత్స్యకారులు దాడికి పాల్పడ్డారు. రిపోర్టర్నని చెప్తున్నా మత్స్యకారులు వినిపించుకోలేదు. కఠారి పాలెం మత్య్సకారులు వెంటపడి దాడి చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెరైన్ డీఎస్పీకి రిపోర్టర్లు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ, చీరాల డీఎస్పీ కఠారీ పాలెం గ్రామానికి వెళ్లారు. గ్రామానికి వచ్చిన ఫిషరీ అధికారులకు.. ఐలవల ఉపయోగిస్తున్న 74 గ్రామాల మత్స్యకారులు …. బల్లవల వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే బల్లవల మత్స్యకారులు అధికారులతో చర్చలు జరపకుండానే సముద్రంలో వేటకు వెళ్లారు. దీనిపై ఐలవల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన రెండు బల్లవల మత్స్యకారుల పడవలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కఠారి తీరప్రాంత ఒడ్డున గల ఫిషరీస్ జేడీ, మెరైన్ డీఎస్పీకి అప్పగించారు.
దీంతో సముద్రంలోని ఐలవల మత్స్యకారులను చీరాల వాడరేవు మత్స్యకారులు అదుపులోకి తీసుకున్నారు. తమ పడవలను విడిపించే వరకు అదుపులో ఉన్నవారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ.. తేల్చి చెప్పారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీగా పోలీసులు మోహరించారు.