ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

  • Published By: bheemraj ,Published On : July 2, 2020 / 10:39 PM IST
ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ (జులై 2, 2020) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది.

అయితే అసెంబ్లీ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలిలో ఆమోదించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో మండలి డిప్యుటీ చైర్మన్‌ ద్రవ్య వినమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది.

నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్‌ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్‌కు ద్రవ్య వినయమ బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.