తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ లాక్ డౌన్..మాస్క్ ధరించకపోతే  జరిమానా 

  • Published By: bheemraj ,Published On : June 23, 2020 / 05:46 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ లాక్ డౌన్..మాస్క్ ధరించకపోతే  జరిమానా 

కరోనా వైరస్ కేసులు ఉధ్థృతమవుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు వ్యాపారులకు ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ స్ఫష్టం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థల కార్యకలాపాలు మాత్రం యథాతథమేనని అన్నారు. అలాగే, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శుభకార్యాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాలకు తహసీల్ధార్ల అనుమతితో నిర్వహించుకోవాలని…10 మంది మాత్రమే పాల్గొనాలని సూచించారు. మాస్క్ ధరించకపోతే పట్టణ ప్రాంతాల్లో రూ.100, గ్రామీణ ప్రాంతాల్లో రూ.50ల చొప్పున జరిమానా విధించనున్నట్టు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేత యాప్ వినియోగించాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం (జూన్ 23, 2020) 87 కేసులు నమోదవ్వడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 706కి చేరింది. వీరిలో 293మంది కోలుకోగా.. ఐదుగురు మరణించారు. ప్రస్తుతం జిల్లాలో 293 యాక్టివ్ కేసులు ఉన్నాయి.