ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
love cheating in chittoor district : ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రియుడు మోసం చేసి వేరే యువతిని పెళ్లి చేసుకోవటంతో, ప్రియుడి అత్తారింటికి వచ్చి శోభనాన్ని అడ్డుకుంది ఓ ప్రియురాలు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పెద్దపంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కెళవాతి గ్రామానికి చెందిన శ్రావణి (21), గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లి గ్రామానికి చెందిన గణేష్ (23)లు కాలేజీ లో చదువుకునే రోజలనుంచి గత ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. కాలేజీ చదువు పూర్తయ్యాక రెండేళ్ల క్రితం ఇద్దరూ బెంగుళూరు వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు.
గణేష్ 11 నెలల క్రితం శ్రావణి చేసే కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవటంతో ప్రేమికులు మరింత దగ్గరయ్యారు. దీంతో ఇద్దరూ కల్సి ఒకే ఇంట్లో సహజీవనం చేయటం ప్రారంభించారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా గణేష్ మూడు నెలల క్రితం బెంగుళూరు సొంత గ్రామానికి చేరుకున్నాడు. కాగా…గణేష్ బుధవారం గంగవరం మండలం కలగటురు గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న
శ్రావణి అదే రోజు రాత్రి కలగటూరు గ్రామానికి చేరుకుని గణేష్ శోభనాన్ని అడ్డుకుంది. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని శ్రావణికి కౌన్సిలింగ్ నిర్వహించారు. శ్రావణి ఫిర్యాదుపై గణేష్ పై ఐపిసి సెక్షన్ 417, 420 కేసులు నమోదు చేశారు.