పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను అభివృద్ధి చేసి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో పాట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్య తరగతి ప్రజలకు సొంత స్థలం, సొంతింటి కల నిజం చేయాలన్న లక్ష్యంతో ఈఆలోచన చేసినట్టు అధికారుల దృష్టికి తెచ్చారు. క్లియర్‌ టైటిల్‌తో వివాదాల్లేని ప్లాట్లు మధ్య తరగతి ప్రజలకు ఇవ్వాలని చెప్పారు. ఇందుకోసం పాలసీ రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

పట్టణ, నగరాల్లోని పేద ప్రజలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా మున్సిపల్‌ శాఖ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్భన్‌ డవలప్‌మెంట్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో వైయస్సార్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగేదన్నారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమ ఉద్దేశం అని తెలిపారు. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలన్నది ఆలోచన అని పేర్కొన్నారు. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను తయారు చేసి లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.

ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు. సరైన టైటిల్‌ ఉందా? అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు వారికి ఉన్నాయని చెప్పారు. లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవని స్పష్టం చేశారు. వివాదాలు లేకుండా, క్లియర్‌ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలని సూచించారు. మధ్యతరగతి ప్రజల కోసం కూడా ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలని తెలిపారు. దీనిపై మేథోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్ ‌డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టిపెట్టమని కలెక్టర్లకు చెప్పామని తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా ఆలోచించమని చెప్పామని పేర్కొన్నారు. లే అవుట్‌ల అందాన్ని పెంచేలా వినూత్నంగా ఆలోచనలు చేయమని చెప్పామని వివరించారు. బస్‌ బే తోపాటు, సృజనాత్మకంగా బస్టాప్‌ కట్టమని చెప్పామని వెల్లడించారు. పట్టణాభివృద్ధి సంస్ధల పరిధిలో దాదాపు 16 వేలకు పైగా లే అవుట్స్‌ వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉంటే.. మనం మరో 17వేల కాలనీలు కడుతున్నామని చెప్పారు. కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌.. ఇవన్నీకూడా ఈ కాలనీల్లో తీసుకు రావాలని సూచించారు.

భీమిలి నుంచి భోగాపురం వరకూ సముద్ర తీరం వెంబడి 6 లేన్ల బీచ్‌ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం..విశాఖపట్నానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుందని సీఎం జగన్ అన్నారు. దీనిపై సమగ్ర కార్యాచరణకు సీఎం ఆదేశించారు. శాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై కొత్త విధానాలను కూడా పరిశీలించాలన్నారు. పట్టణ గృహ నిర్మాణాన్ని వేగతవంతం చేయాలని తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలతో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు, దీనికి సంబంధించి రూ.1000 కోట్లతో డీపీఆర్‌ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.