ఏంబీఏ చదివిన అలేఖ్యకు మూఢనమ్మకాలు, మంత్రాలపై ఎందుకు నమ్మకం ? పునర్జన్మలపై ఎందుకంత పిచ్చి ?

ఏంబీఏ చదివిన అలేఖ్యకు మూఢనమ్మకాలు, మంత్రాలపై ఎందుకు నమ్మకం ? పునర్జన్మలపై ఎందుకంత పిచ్చి ?

Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార్తె అలేఖ్య వల్లే ఈ దారుణం జరిగిందన్న భావన కలుగుతోంది. భోపాల్‌లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైన అలేఖ్య తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఆ మూఢనమ్మకాల వైపు నడిపించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది.

MBA చదివిన అలేఖ్య… సామాన్యురాలేమీ కాదు. 27 ఏళ్ల వయస్సున్న ఆమె… మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో కొంతకాలం పనిచేసింది. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. ఆమెకున్న చదువు శ్రద్ధతో ఆమె ఖచ్చితంగా సివిల్స్ సాధిస్తుందనేది అక్కడి స్థానికుల మాట. అయితే గత కొంతకాలంగా ఇంట్లోనే ఉండటంతో ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతుండటంతో పాటు భక్తి గురించి ఇంట్లో వారికి ఎక్కువగా చెప్తుండేది. దీనికి తోడు పురుషోత్తం కుటుంబానికి మొదటి నుంచి ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి.

దాంతో అలేఖ్య చెప్పే మాటలను తేలిగ్గా నమ్మేశారు ఆమె తల్లిదండ్రులు. అలా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు అధికంగా చదువుతూ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. పునర్జన్మ, కలియుగం అంతం, సత్యలోకం వంటివాటిపై అపరిమితమైన విశ్వాసం పెంచుకున్నారు. దేవుడు అన్న భావన మీద మితిమీరిన నమ్మకం, దెయ్యాలంటే అలవిమాలిన భయం పురుషోత్తమ్ నాయుడు కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి.

మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పీజీలు చేసిన తల్లిదండ్రులు పునర్జన్మ నమ్మకంతో నాలుక కోయడం వారి తీరుకు పరాకాష్ట. కథంతా అలేఖ్య చుట్టూనే నడుస్తోంది. స్క్రీన్‌ప్లే అంతా ఆమెదే… తన కుటుంబం మొత్తాన్ని హిప్నటైజే చేసేసింది. తన ట్రాన్స్‌లో పడేలా చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పిచ్చి తల్లి ఆమెకు సహకరించింది.

తండ్రిని నువ్వు గత జన్మలో అర్జునుడివి అంటూ నమ్మించింది. తల్లిని నువ్వే కాళిక అని చెప్పింది. అసలే మూడభక్తి ట్రాన్స్‌లో ఉన్న తల్లిదండ్రులు మరో లోకంలోకి వెళ్లిపోయారు. దాని ఫలితమే రెండు నిండు జీవితాలు బలి. బంగారు భవిష్యత్‌ ఉన్న పిల్లలిద్దరూ మూడభక్తిలో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మానసిక స్థితి సరిలేని తల్లిదండ్రులు పిచ్చాసుపత్రి పాలయ్యారు.