పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..?

పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..?

Madanapalle twin murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..? లేక హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..?… పురుషోత్తం, పద్మజకు అసలేమైంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత బిడ్డలను కన్నవారే హత్య చేసిన ఘటనలో దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ హత్యలకు పెద్దమ్మాయి అలేఖ్య చర్యలే కారణమన్న కొత్త అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. పునర్జన్మలపై విశ్వాసమే ఈ దారుణ హత్యలకు దారి తీసిందని భావిస్తున్నారు.

తమ పెద్ద కూతురు అలేఖ్య మాటలను గుడ్డిగా నమ్మిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు… ఈ జంట హత్యలకు కారణమయ్యారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబమంతా ముందునుంచే ఓ తెలియని భయం, భ్రమలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యల వెనుక మూడో వ్యక్తి ప్రమేయంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు సేకరించలేదు.

అక్కాచెల్లెళ్ల హత్య ఘటనలో కీలక అంశాలను మదనపల్లికి చెందిన మంత్రగాడు వెలుగులోకి తెచ్చాడు. ఘటన జరగడానికి ముందు రెండు రోజులు ముందు వారి ఇంటికి వెళ్లినట్టు సుబ్బారావు తెలిపాడు. పెద్ద కూతురు అలేఖ్యకు ఆరోగ్యం బాగలేదని చెప్పడంతో తాయెత్తు వేసినట్లు చెప్పారు. ఘటన జరిగిన రోజు రమ్మని పిలిచారని.. అయినా వెళ్లలేదన్నాడు సుబ్బారావు. తాను వెళ్లిన సమయంలో మరో వ్యక్తి ఇంట్లో ఉన్నాడని… అలేఖ్య ఎదురుగా అతను శంఖం ఊదుతున్నాడని సుబ్బారావు తెలిపాడు.

సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం అసలేం జరిగిందన్న దానిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనే ప్రచారంపై ఎలాంటి ఆధారాలు లభించలేదంటున్నారు.

ఇక ప్రస్తుతం జైలులో ఉన్న పద్మజా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదంటున్నారు జైలు సిబ్బంది. జైలులో ఉన్న పద్మజ, పురుషోత్తం నాయుడు దంపతులను మరి కాసేపట్లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించనున్నారు. నిందితులిద్దరికీ మరోసారి మానసిక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.