మహేశ్ ను కాల్చిందెవరు ? అతను నోరు విప్పితే అసలు విషయం తెలుస్తుంది

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 07:13 AM IST
మహేశ్ ను కాల్చిందెవరు ? అతను నోరు విప్పితే అసలు విషయం తెలుస్తుంది

Mahesh Shot Dead : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్‌ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం 10 టీమ్‌లు గాలిస్తున్నాయి. మహేశ్‌ స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును స్పీడప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తుపాకీ కాల్పుల మోతతో బెజవాడ గజగజ వణికిపోయింది.



విజయవాడ సీపీ ఆఫీసులో పని చేసే మహేశ్‌‌ను దారుణంగా హత్య చేసిన వ్యక్తుల కోసం పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహేశ్‌పై కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు. మహేశ్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిందెవరు? హత్య చేసిన వ్యక్తులు మృతుడి కారును ఎందుకు తీసుకెళ్లారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



కాల్పుల్లో గాయపడ్డ మహేశ్ స్నేహితుడు.. హరికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకొని.. నోరు విప్పితేనే మహేశ్ హత్యకు అసలు కారణమేంటో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగుల కాల్పుల నుంచి తప్పించుకున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.



విజయవాడ బైపాస్‌ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్‌ సమీపంలో హత్య జరగడంతో.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్‌‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మహేశ్‌ను ఎవరో ప్లాన్ ప్రకారమే చంపారని..నిందితులెవరైనా వదిలిపెట్టొద్దని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.