యువతిని ఎరగా వేసి యువకుడి హత్య
భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది.
కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడికి భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రామకృష్ణను హత్య చేసి భూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు శ్రీనివాస్. అందుకోసం ఒక యువతిని ఎరగా వేసి రామకృష్ణను రప్పించాడు.
గతేడాది డిసెంబర్ 8న ఆయువతితో ఫోన్ చేయించి రామకృష్ణను కాకినాడ రప్పించాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం రామకృష్ణను హత్య చేసి మృతదేహాన్ని అరట్లకట్ట సమీపంలో పంట కాల్వలో పడేసి పరారయ్యారు. రామకృష్ణ కనపడకపోయే సరికి ఇంట్లో వాళ్లు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు ఎన్నిరోజులకూ స్పందించక పోయే సరికి వారు హై కోర్టునాశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం రామకృష్ణ కాల్ డేటాను పరిశీలించింది. కాల్ డేటా ఆధారంగా యువతిని, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read: బీహార్ లో ఒక్క రోజే 83 మంది ప్రాణాలు తీసిన పిడుగులు